అన్నమయ్య, జూలై 27: అన్నమయ్య జిల్లా పరిధిలోని అన్ని రవాణా వాహనాల యజమానులు 2026 సెప్టెంబర్ 30తో ముగిసే త్రైమాసిక వాహన పన్నును జూలై 31లోపు తప్పనిసరిగా చెల్లించాలని జిల్లా రవాణా శాఖ అధికారి డి. అశోక ప్రతాపరావు సూచించారు. గడువులోపు పన్ను చెల్లిస్తే ఎలాంటి జరిమానా ఉండదని తెలిపారు. వాహన యజమానులు పరివాహన్ సేవా పోర్టల్ ద్వారా ఆన్లైన్లో సులభంగా పన్ను చెల్లించవచ్చన్నారు. గడువు దాటిన తర్వాత పన్ను చెల్లించకుండా తనిఖీల్లో పట్టుబడితే పన్నుతో పాటు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించారు. ఆగస్టులో పట్టుబడితే పన్నుపై 100 శాతం, సెప్టెంబరులో పట్టుబడితే 200 శాతం జరిమానా విధిస్తారని పేర్కొన్నారు. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా జూలై 31లోపు పన్ను చెల్లించి అనవసరమైన జరిమానాలు, ఇబ్బందులను నివారించుకోవాలని వాహన యజమానులకు విజ్ఞప్తి చేశారు.


