ప్రొద్దుటూరు, జూలై 27 (కలం మనస్సాక్షి ప్రతినిధి): వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులోని కొత్తపల్లి కాలువ ఆధునీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి సూచనల మేరకు, మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి పర్యవేక్షణలో ఈ పనులు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. గతంలో సుమారు రెండు అడుగుల లోతు మాత్రమే ఉన్న కాలువను ప్రస్తుతం దాదాపు పది అడుగుల లోతు వరకు విస్తరించి ఆధునీకరిస్తున్నారు. పనులు పూర్తయిన అనంతరం ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధి నుంచి వచ్చే వర్షపు నీరు, మురుగునీరు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రవహించేలా సౌకర్యం కలగనుందని అధికారులు పేర్కొంటున్నారు. ఈ పనుల ద్వారా కొత్తపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్లుగా నెలకొన్న డ్రైనేజీ సమస్యకు గణనీయమైన పరిష్కారం లభిస్తుందని గ్రామస్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామాభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మాజీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డిని స్థానికులు అభినందించారు. గ్రామ అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగాలని కోరారు.



