రాయచోటి :
హంద్రీనీవా ప్రాజెక్టు పనులను పూర్తి చేసి చివరి ప్రాంతాల వరకు తాగు, సాగునీరు అందిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడంపై రాష్ట్ర రవాణా, యువజన క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా రాయచోటి పట్టణం సహా పరిసర ప్రాంతాలకు త్వరలోనే నీటి సరఫరా అందేలా చర్యలు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు. రాయలసీమ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న అన్ని నీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం పేర్కొన్నారు. రైతులకు, తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్న పట్టణ ప్రజలకు ఉపశమనం కలిగించేలా సమగ్ర ప్రణాళిక అమలు చేస్తున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో రాయచోటికి తాగు నీరు, సాగు నీరు అందేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాయలసీమ ప్రాంత ప్రజల ఆశలను నెరవేర్చే దిశగా సీఎం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి కావడం ద్వారా రాయలసీమలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని ప్రభుత్వం విశ్వాసం వ్యక్తం చేసింది. సీఎం నాయకత్వంలో ప్రాంతీయ అసమానతలను తొలగించి ప్రజలకు నీటి భద్రత కల్పించే దిశగా కీలక అడుగులు వేస్తోందని మంత్రి తెలిపారు.