ఫసల్ బీమా యోజన పథకాన్ని రైతులు వినియోగించుకోవాలి
రైతులకు మంత్రి సూచన
ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పథకాన్ని రైతులందరూ సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో పథకానికి సంబంధించిన గోడ పత్రికను శుక్రవారం మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా ఈ పథకాన్ని అమలు చేస్తుందని, తుఫాను, కరువు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల కారణం వల్ల నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందించేందుకు ఈ పంట బీమా పథకం ఉపయోగపడుతుందన్నారు. రైతుకు తలెత్తిన నష్టాన్ని అంచనా వేసి సాగు చేసిన రైతులకు ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తింపజేసి పరిహారం అందించనున్నట్టు తెలిపారు. ప్రధానంగా వరి.(ధాన్యం), మొక్క జొన్న (మక్కా), నువ్వులు, ప్రత్తి పంట రైతులకు లాభం చేకూరుతుందన్నారు. ఈ పథకం కింద రైతులకు సహజ ఉత్పత్తుల నుండి రక్షణ కల్పించేందుకు రైతులకు ఆర్థిక భరోసా అందివ్వనున్నట్లు తెలిపారు. రైతులు తక్కువ ప్రీమియం చెల్లించి అధిక భీమా రక్షణ పొందవచ్చునని సూచించారు. రైతులు ఆరుగాలం కష్టపడి పంట పండించినా కొన్నిసార్లు వాతావరణంలో వచ్చే మార్పుల వల్లగాని, ప్రకృతి వైపరీత్యాల వల్లగాని పంటలు చేతికందని పరిస్థితి నెలకొంటోంది. ఇలాంటి సమయంలో పంటలకు బీమా ఉంటే నష్టపోయిన మొత్తానికి బీమాసంస్థ నుంచి ఆర్ధిక సాయం అందుతుంది. ఇందులో భాగంగానే రైతులు నష్టపోకుండా ఉండటానికి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్బీమా పథకాన్ని అమలు చేస్తోంది. పంటనష్టం జరిగిందని తెలియగానే బీమా మొత్తంలో 25 శాతం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. వరద వంటి విపత్తులకు కూడా బీమా వర్తిస్తుందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు గోవిందరావు, జగన్మోహన్ రావు, తదితరులు పాల్గొన్నారు. జారీ చేసిన వారు: పిఆర్వో, వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పశుసంవర్థక , మత్స్యశాఖ మంత్రివర్యులు.